తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల (శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ ఉత్సవాలు పది రోజుల పాటు అంటే మే 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భాష్యకార్ల వారిని పది రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం మాడ వీధుల్లో విహరింపజేయనున్నారు. అలాగే తిరుమంజనం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
శ్రీ భాష్యకార్ల ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.