
గతంలో తిరుమలలో సీఆర్వోలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో గదుల కేటాయింపు కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం సీఆర్వోలో మాత్రమే గదులు ఇస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఓ భక్తుడు టీటీడీ ఈవోని ప్రశ్నించగా.. ఇతర ప్రాంతాల్లో గదుల కేటాయింపు వల్ల పలు సమస్యలు వస్తున్నాయని సీఆర్వోకే పరిమితం చేశామన్నారు. దీనిపై భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. శ్రీవారి దర్శనానికి పారామిలిటరీ దళాలకు ప్రత్యేక అవకాశం కల్పించాలని కోరగా.. ఇప్పటికే ఆర్మడ్ ఫోర్స్కు ఈ అవకాశం ఉందని.. కోటా పెంచడం సాధ్యం కాదని ఈవో తెలిపారు. ఆర్మడ్ ఫోర్స్ కోటాలోనే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు..
అఖిలాండ వద్ద చిరు వ్యాపారుల వద్ద భద్రతా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ భక్తుడు ఈవోకు తెలియజేయగా.. వివరాలు తెలియజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సర్వ దర్శనానికి వచ్చి దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని.. వారికి ఏమైన ప్రత్యేక దర్శన సదుపాయం ఉందా? అని ప్రశ్నించగా.. ఇప్పటికే రోజుకు 750 టోకెన్లు వృద్ధులు, దివ్యాంగులకు జారీ చేస్తున్నామని.. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించలేమన్నారు. సీనియర్ సిటిజన్లకు వమో భారం దృష్ట్యా ఆలయానికి దగ్గరగా వసతి గదులు కేటాయింపు, అన్నప్రసాద కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మరో భక్తుడు కోరగా.. గదుల కేటాయింపు విషయంలో మీ సూచనను పరిశీలిస్తాం. అన్నప్రసాద భవనంలోని హాల్-1లో ఇప్పటికే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
