సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహ స్వామి విజయ ప్రదాత. ఈ క్షేత్రంలో రెండు ప్రధాన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే సింహాచలస్వామి చైత్రమాసంలో పెళ్లికొడుకు అవుతాడు. వైశాఖ శుద్ధ తదియనాడు ఆయనకు చందనసేవ జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింపచేసే దేవుడు సింహాచలం అప్పన్న. అప్ప అంటే తండ్రి అనే అర్థంలో విశాఖ వాసులు ఈ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు.
నరసింహస్వామి ఉగ్రమూర్తి. భయం గొలిపేలా ఉంటాడు. కానీ సింహాచలం అప్పన్నస్వామిలో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు. నిరంతరం చందనపు పూతలో దర్శనమిస్తాడు. ఏడాదికి ఒకమారు అక్షయ తృతీయ నాడు చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుణ్ణి లాలిస్తూ భక్తరక్షణ కోసం తాపత్రయపడుతూ కనిపిస్తాడు. నిజరూపంలో స్వామివారు వరాహ ముఖంతో మానవ దేహంతో సింహపు తోకతో, జూలుతో వుంటాడు. కుడిచేతి వేలితో గరుత్మంతుడికి అమృతం తాగిస్తూ ఎడమ చేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు. స్వామి పాదాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయి.