విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే నిజ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తుండటంతో ఆయనను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు సింహాచలానికి పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం అర్చకులు స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు.
చందనాన్ని వేరు చేయడంతో నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ వైదిక కార్యక్రమాలన్నీ పూర్తైన అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకూ ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు. అనంతరం సామాన్య భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.