శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ- నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉద‌యం 6 గంటలకు శ్రీ కృష్ణ‌స్వామివారిని శ్రీ భూవ‌ర‌హ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకువ‌చ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంల‌తో అర్చకులు అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూత‌న య‌జ్ఞోప‌వీతాన్ని స‌మ‌ర్పించి, ఆస్థానం నిర్వహించారు. అటు తరువాత శ్రీకృష్ణస్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తిరిగి చేరుకున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, హోమం, ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

Share this post with your friends