కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలోని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. పోలీసులతో పాటు ఆలయ సిబ్బంది, వైద్య సిబ్బంది సైతం ఈ మాక్ డ్రిల్లో పాల్గాన్నారు.
ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోపస్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, డీఎస్పీ శ్రీ విజయ శేఖర్, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.