తిరుపతిలో జనవరి 8వ తేదీ అంటే వైకుంఠ ఏకాదశికి ముందు టోకెన్ల కోసం వెళ్లిన భక్తుల మధ్య జరిగిన తోపులాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిహారం అందజేస్తోంది. ఈ క్రమంలోనే తోపులాటలో మృతి చెందిన తమిళనాడు రాష్ట్రం మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు శుక్రవారం అందజేశారు.పరిహారం చెక్ను మృతురాలు మల్లిక ఏకైక కుమారుడు శ్రీ రమేష్ కు టిటిడి బోర్డు సభ్యులు శ్రీ. నరేష్ కుమార్, శ్రీ.రామ్మూర్తి, శ్రీ. శాంతారాం, శ్రీ. కృష్ణమూర్తి అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యుల వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు టీటీడీ బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేశారు, అందులో భాగంగా శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి సదరు బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు.