మల్టీ పర్పస్ క్లీనింగ్కు ఉపయోగించే రైడ్ ఆన్ స్వీపర్ మెషీన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందింది. రూ.25 లక్షలు విలువైన రైడ్ ఆన్ స్వీపిర్ మెషిన్ మంగళవారం టీటీడీకి విరాళంగా రోస్సరి ప్రొఫెషనల్ కంపెనీ అందించింది. అధునాతన జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ మెషిన్ బ్యాటరీ తో పని చేస్తుంది.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి రోస్సరి ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన ప్రతినిధులు మెషిన్ను అందజేశారు.
కాగా.. నేటి నుంచి శ్రీ మలయప్ప స్వామివారి సేవకు సంబంధించిన జూన్ నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. దాని ఆధారంగా శ్రీవారి సేవలో పలు మార్పులు చేశారు. ఈ మార్పులు నేడు రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమల్లోకి రానున్నాయి.