తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాల్లో మధురై మీనాక్షి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ పెద్ద ఎత్తున చిత్తిరై ఉత్సవం చాలా ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. దీనిలో భాగంగా స్వర్ణ పల్లకిపై మీనాక్షి సుందరేశ్వరులు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఊరేగింపులో హిందూ, ముస్లిం ఐకమత్యం కూడా ఈ ఉత్సవంలో కనిపిస్తోంది. మీనాక్షి సుందరేశ్వరుల ఊరేగింపు ముఘాయిద్దీన్ అండవర్ మసీదు మీదుగా వెళుతుండగా అక్కడి ముస్లింలు భక్తులకు, పూజారులకు చల్లని రోజ్ మిల్క్, స్వీట్స్ను అందించారు.
ఈ క్రమంలోనే ఆలయ అర్చకులు మసీదు ప్రతినిధికి పూలమాలను సమర్పించారు. అయితే మీనాక్షి అమ్మవారి ఊరేగింపులో రోజ్ మిల్క్, స్వీట్స్ భక్తులకు అందించడం ఈనాటి సంప్రదాయం కాదు.. 26 ఏళ్లుగా కొనసాగుతోంది. దీనిపై మసీదు నిర్వాహకుడు కమరుద్దీన్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాత మధురై చితిరై పండుగలో నాలుగవ రోజున ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరుగుతుందని.. ఇలా మసీదు మీదుగా మీనాక్షి అమ్మన్ ఊరేగింపు సమయంలో భక్తులకు గులాబీ పాలు, స్వీట్లు అందించడం ఆచారమని మసీదు నిర్వాహకుడు కమరుద్దీన్ చెప్పారు.