తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నప్రసాద కేంద్రానికి పెద్ద మొత్తంలో విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ ఈ విరాళాన్ని అందజేసింది. శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ బి.రమేష్ విరాళం డీడీని అందజేశారు. అనంతరం స్వామివారిని సంస్థ ప్రతినిధులు దర్శించుకున్నారు. అన్నప్రసాదం ట్రస్ట్కు కోటి రూపాయలు విరాళం అందించిన సంస్థను టీటీడీ చైర్మన్ అభినందించారు.
మరోవైపు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మే 2వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తున్నారు.