అయోధ్య రామయ్య దర్శనానికి ముస్లిం మహిళ.. అనుమానాస్పదంగా ఉండటంతో..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ వ్యాప్తంగా అన్ని ముఖ్య రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాలు, ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిరంలోనూ భద్రతను మరింత పటిష్టం చేశారు. తాజాగా అయోధ్య రామాలయంలో ఓ ముస్లిం మహిళ ప్రవర్తన తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఇరిమ్ అనే ముస్లిం మహిళ రామ్ లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు వచ్చింది. రాంలల్లాను దర్శించుకుని ఆలయం నుంచి ఎగ్జిట్ గేటు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది.

తల, ముఖాన్ని నీలిరంగు వస్త్రంతో కప్పుకుని ఇరిమ్.. స్వామివారిని దర్శించుకుంది. ఆమె ఎగ్జిట్ గేటు దగ్గరకు వచ్చిన తర్వాత కానీ భద్రతా సిబ్బంది ఆమెను గమనించలేదు. ఎగ్జిట్ గేటు దగ్గర అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అనిపించడంతో ఇరిమ్‌ను భద్రతా సిబ్బంది ఆపింది. ఆమెను భద్రతా సిబ్బంది ప్రశ్నించగా దురుసుగా సమాధానాలివ్వడమే కాకుండా వారిపైనే వాగ్వాదానికి దిగింది. వెంటనే ఆమెను ఆలయ ఆవరణలోనే పోలీసులు విచారించారు. విచారణ సమయంలో సైతం ఆమె పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. అయితే ఆమె వద్ద ఎలాంటి అభ్యంతరకరమైన వస్తువులూ లభించలేదని తెలుస్తోంది. మరి నిజంగానే ఆమె భక్తురాలా? లేదంటే ఏదైనా కుట్రలో భాగంగా అక్కడికి వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది.

Share this post with your friends