
అమ్మవారి ఆలయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసలు ఊహించని ఘటనకు స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. దొంగలు వింత పోకడిని ప్రదర్శించారు. తమ ప్రవృత్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. నెలరోజుల క్రితం బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో హుండీ చోరీకి గురైంది. అయితే చోరి చేసిన నగదును దుండగులు నిన్నటి రాత్రి ఆలయ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు.
అది కాస్తా క్షణాల్లో ఊరంతా పాకింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. ఆలయ అధికారులు నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కింపు చేపట్టారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడిన వారు డబ్బుతో పాటు ఒక లేఖను కూడా పెట్టి వెళ్లారు. హుండీని తాము నలుగురు వ్యక్తులం కలసి చోరీ చేశామని దొంగలు లెటర్ రాసి మరి నగదును పడేసి వెళ్లారు. దొంగతనం చేసినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినట్లు దుండగులు ఒక లెటర్ రాసి సంచిలో వేసి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
