మే 12న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్ర పుష్పయాగం

తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 12వ తేదీన అత్యంత వైభవంగా ప‌త్ర పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం మే 11వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ జ‌రుగ‌నుంది. మే 12న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారు, శ్రీ కామ‌క్షి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు న‌వ క‌ల‌శ స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు ర‌సం, కొబ్బ‌రినీళ్ళు, విబూది, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేస్తారు.

ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్ర పుష్ప‌యాగ మ‌హోత్స‌వం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామ‌ర‌, మ‌ల్లి, వృక్షి, క‌న‌కాంబ‌రంల‌తో పాటు బిల్వ ప‌త్రం, తుల‌సి, ప‌న్నీరు ఆకుల‌తో స్వామి, అమ్మవార్లకు ప‌త్ర పుష్ప యాగ మ‌హోత్స‌వం చేపట్టనున్నారు. లోక క్షేమం కొర‌కు, ఆల‌యంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ప‌త్ర పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

Share this post with your friends