తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిఎల్వో శ్రీ వీర్రాజు, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పెష్కార్ శ్రీ శ్రీ హరి, తదితరులు పాల్గొన్నారు.