చిత్తూరు జిల్లా గంగవరం (మం), కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మే 5 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 13వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఏ ఆలయంలోనైనా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే నిన్న ఉదయం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఇందులో భాగంగా గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. గజేంద్ర, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.