శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. జూన్ 02 నుంచి గోవిందరాజ స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 10న ధ్వజారోహణంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం 6.45 గంటలకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణం లోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు . అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ ఏ పీ శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends