29న కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో మే 5 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు మే 13వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ నెల 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేందుకు ఆలయ అర్చకులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Share this post with your friends