శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శాస్త్రోక్తంగా జేఈవో పూజలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మీన‌లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

బ్రహ్మోత్సవాలపై జేఈవో వి.వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ.. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 18 నుంచి 26వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీ‌నివాస‌మంగాపురంలో తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 22న గరుడసేవ, ఫిబ్ర‌వ‌రి 23న స్వర్ణరథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 25న రథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 26న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

మీడియా సెంట‌ర్‌లో శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించిన జేఈవో :

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టీటీడీ ప్ర‌జా సంబంధాల విభాగం ఆధ్వ‌ర్యంలో వాహ‌న మండ‌పం పక్క‌న ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్‌లో జేఈవో శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు. మంగ‌ళ‌వారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Share this post with your friends