శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

11 పరదాలు విరాళం :

హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి అనే భ‌క్తుడు ఆలయానికి 11 పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీ శేష‌గిరి, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబరు 16 నుంచి 18వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 15న సాయంత్రం ప‌విత్రోత్సవాల‌కు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి చేప‌డ‌తారు. పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends