తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో శ్రీ వై.సతీష్ కుమార్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ భవతు భారతం…”, “ అమ్మమ్మ ఏమమ్మ…”, “సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్…..” తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీవి. వీరబ్రహ్మం, డిఎల్వో శ్రీ వరప్రసాద్ రావు, సీఈ శ్రీ సత్యనారాయణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజి, సిపిఆర్వో డా.టి.రవి, అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.