అక్కడ హనుమాన్ జయంతి వేడుకల గురించి తెలిస్తే..

ఉజ్జయిని ఒక ఆధ్యాత్మిక నగరంగా పేరు గాంచింది. ఇక్కడ నిత్యం పండుగ వాతావరణమే మనకు కనిపిస్తుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అయితే ఈ నగరం మరింత శోభాయమానంగా వెలిగిపోతుంది. దేశమంతా శనివారం హనుమాన్ జయంతిని జరుపుకుంటుంటే.. ఇక్కడ మాత్రం ఆదివారం జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఉజ్జయినిలో భండారా పేరిట గొప్ప విందు భోజనం లేదంటే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది మధ్యప్రదేశ్‌లోనే అతిపెద్ద భండారా అని దీనికి నిర్వాహక కమిటీ అయితే నాగర్ భోజ్ (నగర విందు) అని పేరు పెట్టారు. దాదాపు 50 వేల మంది భక్తులు బాబా జై వీర హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరిస్తారని అంచనా వేస్తున్నారు.

ఉజ్జయినిలోని అంబపురలో ఈ జైవీర్ హనుమాన్ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైనది. హనుమాన్ జయంతి నాడు ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహిస్తారు. దీని తర్వాత నగర విందు నిర్వహిస్తారు. అక్కడి వారికి హునుమంతుడంటే అమితమైన భక్తి. ఈ క్రమంలోనే గత 20 ఏళ్లుగా హనుమాన్ జయంతి నాడు భండారా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. తొలినాళ్లలో ఈ కార్యక్రమాన్ని ఊరేగింపు రూపంలో నిర్వహించేవారు. అనంతరం అంటే పదేల్లుగా ఇది చాలా పెద్ద కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఇక ఇప్పుడైతే దాదాపుగా ఉజ్జయిని మొత్తం బాబా జై వీర్ హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించేందుకు అక్కడకు చేరుకుంటారు.

Share this post with your friends