ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి భారీ విరాళం అందింది. చంద్రబాబు ఆదివారం తన 75వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాద కేంద్రానికి రూ.44 లక్షలు విరాళాన్ని ఏపీలోని ఓ విద్యాసంస్థల అధినేత అందించారు. ఈ సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు ఈ విరాళాన్ని అందజేశారు. భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ ఈ విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.