వరూధిని ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరిస్తే మంచిదని తెలుసుకున్నాం కదా. అసలు ఏకాదశి నాడు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ ఉపవాసం ఆచరించేవారు రోజు వారి పూజలతో పాటు రోజంతా ఆహారం తీసుకోకుండా పాలు, పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఇలా చేసి సాయంత్రం మాత్రం ఉండలేని వారు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను స్వీకరించవచ్చు. హరినక్తంగా దీనిని పిలుస్తారు. ఇలా చేసిన మీదట మరుసటి రోజున ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి ఉపవాసం అంటారు. ఈ విధంగా చేస్తే ఏకాదశి ఉపవాస ఫలితం లభిస్తుంది.
అలాగే వరూధిని ఏకాదశి నాడు దానాలు చేస్తే మంచిదని తెలుసుకున్నాం కదా. అయితే దానం ఏదైనా సూర్యోదయ సమయంలో ఇస్తే మంచి ఫలితం ఉంటుందట. ఈ పవిత్రమైన రోజున తమ స్తోమతను బట్టి దానం ఇవ్వవచ్చు. బంగారం, నీటి కుండ వంటివి దానం చేయవచ్చు. నీటి కుండ నిండా నీళ్లు నింపి దాహంతో ఉన్న బ్రహ్మణులకు దానమిస్తే మంచిదట. ఉపవాసం లేని వారు సైతం వరూధిని ఏకాదశి నాడు నీటి కుండను దానమిస్తే ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందట. అలాగే ధాన్యం ఇచ్చినా కూడా ఫలితం చాలా బాగుంటుందట. వరూధిని ఏకాదశి నాడు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాదం, పండ్లు, మంచి నీళ్లు పంచినా కూడా ఫలితం చాలా బాగుంటుందట.