
భారత్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దేశంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేస్తున్నారు. ముఖ్యంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న ఆలయాలపై సైతం భారత్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. . కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో తిరుమల కూడా ఒకటి కావడంతో డీజీపీ హరీష్ గుప్తా భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ నిర్వహించనున్నట్టు తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్ వెల్లడించారు.
ఇక మీదట ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్, పోలీసులతో కలిపి నాలుగు బృందాలుగా ఏర్పడి 138 మంది సిబ్బందితో నిరంతరం గస్తీ కాయనున్నట్టు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన మీదటే కొండపైకి అనుమతిస్తున్నారు. మరోవైపు రేణుగుంట విమానాశ్రయంలోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. దేశంలోని అన్ని విమానాశ్రయాల భద్రతపై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ భద్రత పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
