జనవరి 15వ తేదీన ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం’

తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. 11.45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లం, బియ్యం, గ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

Share this post with your friends