ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే స్వామివారికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను, పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కూడి శుక్రవారం నాడు విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.
వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర
స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర పెద్ద ఎత్తున జరిగింది. ఆలయం నుంచి కల్యాణవేదిక వరకు వైభవంగా ఈ శోభాయాత్రను నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. శ్రీ సీతారాముల కల్యాణానికి 70 వేల మంది భక్తులు హాజరయ్యారు. స్వామివారి కల్యాణంతో పాటు శోభాయాత్రలో పాల్గొని ఆనందపరవశులయ్యారు.