ఇవాళ్టి నుంచి మొదలు ఈ నెల 14 వరకూ మిట్ట మధ్యాహ్న సమయంలో మనిషి నీడ మాయం కానుంది. ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (IASC) ఈ విషయాన్ని వెల్లడించింది. ఐఏఎస్సీ చెప్పిన దాని ప్రకారం మిట్ట మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు మనిషి నీడ మాయం కానుంది. ఇలా మనిషి నీడ మాయం కావడాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారు. సాధారణంగా అయితే మనిషి నడుచుకుంటూ వెళుతుంటే ఏదో పక్క నీడ కనిపించడం సర్వసాధారణం. కానీ నేటి నుంచి 14వ తేదీ వరకూ మాత్రం ఈ నీడ కనిపించదు.
ఇలా నీడ మాయమవడానికి కారణం లేకపోలేదు. సూర్యకాంతి మన మీద లంబంగా పడటమేనని ఐఏఎస్సీ వివరించింది. భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉంటుంది. అయితే సూర్యుడి చుట్టూ భూమి భ్రమణం చేసే సమయంలో సూర్యుని స్థానం ఉత్తర-దక్షిణ దిశల్లో మారుతూ ఉండటం వలన కర్కాటక, మకరరేఖల మధ్య ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్న సమయాల్లో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయి. దీనివల్ల నిలువు వస్తువుల నీడ రెండు నిమిషాల వరకు పూర్తిగా మాయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి నేటి నుంచి మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు జీరో షాడో కనువిందు చేయనుంది.