ఇవాళ శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగానికి అంకురార్పణ

తిరుపతి శ్రీకోదండరామ స్వామివారి ఆలయంలో మే 3వ తేదీన పుష్పయాగం అత్యంత వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ పుష్పయాగం సంద‌ర్భంగా ఇవాళ (శుక్రవారం) సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. మే 3న ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.

అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు. శ్రీ కోదండరామాలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.

Share this post with your friends