ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు విస్తృత ఏర్పాట్లు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం స‌మన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు వెల్లడించారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం ఈవో, కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, శ్రీ సీతారాముల కళ్యాణానికి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్ప‌ణ‌

శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

ఇంజినీరింగ్:

కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశాం. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టాం. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశాం. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం. ఆల‌య ప్రాంగ‌ణంలో న‌డిచే భ‌క్తుల‌కు ఎండ వేడి ఉప‌స‌మ‌నం కొర‌కు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో వైట్ పెయింట్ వేశాం. ఆల‌య స‌మీపంలో 3 వేల మంది భ‌క్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్ల‌లో వెళ్ళెందుకు జ‌ర్మ‌న్ షెడ్డు ఏర్పాటు చేశాం.

శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఈ ఏడాది భ‌క్తుల సౌల‌భ్యం కొర‌కు అత్యాధునిక టెక్నాల‌జితో 21 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఆలయం , కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం.

నిఘా, భ‌ద్రత:

టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందితో పటిష్ట భద్రత. అదేవిధంగా 130 సిసి కెమెరాలు, 20 డ్రోన్ లు ఏర్పాటు.

4 ఫైర్ ఇంజ‌న్లు, ఒక అత్య‌వ‌స‌ర వాహ‌నాల‌తో పాటు అత్య‌వ‌స‌ర సేవలందించేందుకు ఫైర్‌, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంల ఏర్పాటు

సాలాబాద్ జంక్ష‌న్ నుంచి సాయిన‌గ‌ర్ వ‌ర‌కు దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్‌, ప‌ర్య‌వేక్ష‌ణ టీంలు ఏర్పాటు

అన్న‌ప్ర‌సాదాలు:

శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో, క‌ల్యాణ వేదిక వ‌ద్ద అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రుగుతోంది. క‌ల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాల‌రీల‌లో వేచి ఉండే భ‌క్తులకు సాయంత్రం నుండి లెమ‌న్ రైస్‌, చ‌క్క‌ర పొంగ‌లి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందిస్తాం. ⁠బ్రహ్మోత్సవాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ ట‌బ్బుల ద్వారా నీటి స‌ర‌ఫ‌ర‌, మ‌జ్జిగ ప్యాకెట్లు అందిస్తాం.

ర‌వాణా

ఆర్‌టీసీ ద్వారా క‌డ‌ప నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 85 బ‌స్సుల‌తో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 40 బ‌స్సుల‌తో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పిస్తున్నాం. ⁠ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ ప్రాంతాల నుండి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు 20 బ‌స్సులు ఏర్పాటు చేశాం.

పుష్పాలంక‌ర‌ణ‌లు:

కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ⁠మొదటిసారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశాం.

సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు:

శ్రీ సీతా రాముల క‌ల్యాణంలో గోవింద‌నామ స‌ర‌ళిలో శ్రీ రామ‌నామ భ‌జ‌నామృతం.
హెచ్ డిపీపీ – (18), దాస సాహిత్య ప్రాజెక్టు – (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వైద్యం:

13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

పారిశుద్ధ్యం:

కళ్యాణ వేదిక ఆలయ పరిసరాలలో 250 మరుగుదొడ్లు, టిటిడి జిల్లా యంత్రాంగం సమన్వయంతో 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు.

Share this post with your friends