తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. స్వామివారికి తమ కోరికను వెల్లడించి ఏదో ఒకటి మొక్కుకుంటారు. కోరిక తీరిన వెంటనే తిరుమలకు వచ్చి తమ మొక్కును చెల్లించుకుంటారు. మొక్కు ఉన్నా లేకున్నా కొందరు మాత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ఏదో ఒకటి విరాళం అందజేస్తూనే ఉంటారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.1.40 లక్షలు విలువైన బిగాస్ సి12 మాక్స్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ను టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గుప్తా స్కూటర్ తాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ శ్రీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం కూడా ఓ భక్తుడు టీటీడీ అన్నదాన కేంద్రానికి కోటి రూపాయల విరాళం అందించారు. కాగా.. తిరుమలలో భద్రతా దళాల డొల్లతనంపై విమర్శలు వినవస్తున్నాయి. కశ్మీర్లోని ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్యమత గుర్తుతో ఉన్న ఒక కారును గుర్తించారు. దీనిపై భక్తుల నుంచి విమర్శలు వినవస్తున్నాయి.