అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణం తొలి దశ పూర్తి కాగానే బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరాడు. అప్పటి నుంచి నిత్యం వేలాది మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రామాలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. నిరంతరం ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే అయోధ్య-గోండా రహదారిని ఆరు లైన్ల రహదారిగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్వాహకులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రామ మందిరంలో సొరంగ నిర్మాణం చేపట్టారు.
ఈ నెల చివరకు రామ మందిర నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఎక్కడా కూడా ఇనుము ఉపయోగించకుండా అత్యున్నత ప్రమాణాలతో రామ మందిర నిర్మాణం చేపట్టినట్టు రామాలయ ట్రస్ట్ తెలిపింది. రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించేందుకు కొత్తగా సొరంగ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా సొరంగ మార్గాన్ని చేపడుతున్నారు. రామాలయానికి తూర్పు భాగం నేలమట్టంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆలయానికి దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గం ద్వారా ఒకేసారి లక్షన్నర మంది భక్తులు ప్రదక్షిణ చేయవచ్చు.