తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం సీజేఐ వారికి టిటిడి ఈవో తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తిరుమల చేరిన గౌరవ సీజేఐ
శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం తిరుమల చేరుకున్న సీజేఐ గారికి శ్రీ పద్మావతీ అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. శాస్త్రోక్తంగా చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు.
ఇవాళ స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ
తిరుమల, తిరుపతి స్థానికుల కోటా దర్శనంలో భాగంగా ఏప్రిల్ 06వ తేది ఆదివారం నాడు స్థానికులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.