చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రోజు సాయంత్రమే ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు.
ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసభట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఎక్కడికక్కడ చలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు , పలువురు అధికారులు పాల్గొన్నారు.