నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో నిన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున అంకురార్పణతో పాటు స్వామివారికి అభిషేకం, తిరుమంజనం, ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక నేటి ఉదయం 9 గంటలకు అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గరుడ ముద్ద, సాయంత్రం 7 గంటలకు భేరీ పూజ, దేవతావాహనం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 18న మహాపూర్ణాహుతి, చక్రస్నానంతో ముగియనున్నాయి. జూన్ 17వ తేదీన రాత్రి 7:30 గంటలకు రంగనాథ స్వామి వారి తిరుకల్యాణాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం నిర్మించారు. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాయకాయక స్వామిని తలపించేలా ఆలయం నిర్మాణం జరిగింది. కాకతీయుల కాలంలో వింజూరు వంశానికి చెందిన నరసింహా చార్యుల వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారట. అనంతరం అటువంటి ప్రతిమనే శ్రీపురం గ్రామంలో ప్రతిష్టించారు.