డిసెంబరు 11న గీతా జయంతి పెద్ద ఎత్తున జరుగనుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో డిసెంబరు 8న ఆదివారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థం పోటీలు జరుగనున్నాయి. టీటీడీ విద్యాసంస్థలు, తిరుపతిలోని పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో (ధ్యాన యోగం) పోటీలు నిర్వహిస్తారు.
6, 7 తరగతుల విద్యార్థులు ఒక విభాగం గాను, 8, 9 తరగతుల విద్యార్థులు మరో విభాగంగాను పోటీలు నిర్వహిస్తారు. అదేవిధంగా, 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో 18 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఒక విభాగంగాను, 18 సంవత్సరాలు పైబడినవారికి మరో విభాగంగాను పోటీలు జరుగనున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు 8వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డిసెంబరు 11న గీతాజయంతి రోజున బహుమతులు ప్రధానం చేస్తారు.