తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణయోత్సవాల కోసం దశావతార అష్టలక్ష్మీ మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలను తీసుకొచ్చి భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో దశావతార – అష్టలక్ష్మి మండపాన్ని అలంకరించారు. ఈ మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు శోభాయమానంగా ప్రారంభించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు మే 8వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఒక టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.