తిరుమ‌ల‌లో భూలోక వైకుంఠాన్ని తలపించిన దశావతార – అష్టలక్ష్మి మండపం

తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణయోత్సవాల కోసం దశావతార అష్టలక్ష్మీ మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలను తీసుకొచ్చి భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో దశావతార – అష్టలక్ష్మి మండపాన్ని అలంకరించారు. ఈ మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు శోభాయమానంగా ప్రారంభించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు మే 8వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఒక టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends