న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంటే మే 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు మే 10న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం అత్యంత వైభవంగా వాహన సేవలను నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం మే 15వ తేదీన సాయంత్రం జరుగనుంది. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగనుంది. చివరి రోజున స్వామివారి చక్రస్నానానికి ఏర్పాట్లు చేశారు.