మే 11 నుంచి న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంటే మే 19వ తేదీ వరకు అత్యంత వైభ‌వంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు మే 10న‌ సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం అత్యంత వైభవంగా వాహన సేవలను నిర్వహించనున్నారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం మే 15వ తేదీన సాయంత్రం జరుగనుంది. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగనుంది. చివరి రోజున స్వామివారి చక్రస్నానానికి ఏర్పాట్లు చేశారు.

Share this post with your friends