చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల మధ్య కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.
ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అంతకుముందు గ్రామ పోలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ కోనేటిరాయ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. గజేంద్ర ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.