తిరుమలలో నిత్యం టీటీడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. రోజుకో.. రెండ్రోజులకో ఒక ప్రదేశాన్ని తనిఖీ చేసి మంచి, చెడులను తెలుసుకుంటున్నారు. మొత్తానికి భక్తలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విక్రయ కేంద్రం, డాలర్ల విక్రయ కేంద్రాలను గురువారం ఉదయం టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.
ముందుగా అఖిలాండం వద్ద ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి కొబ్బరి కాయల సైజును పరిశీలించారు. కొబ్బరి కాయల విక్రయంపై భక్తుల అభిప్రాయాలను ఆరా తీశారు. అనంతరం టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి చేరుకున్న అదనపు ఈవో స్టాక్ ను పరిశీలించారు. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు. అదేవిధంగా టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రానికి చేరుకుని డాలర్ల విక్రయం పరిశీలించారు. అమ్మకాలపై వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర పాల్గొన్నారు.