తిరుమలలో నిత్యం ఏదో ఒక చోట తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకరోజు క్యూలైన్లను సందర్శిస్తే.. మరో రోజు అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తున్నారు. అలాగే తిరుమల మొత్తం స్వచ్ఛంగా ఉండేందుకు తగు చర్యలు సైతం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది.
ఈ నేపథ్యంలో నారాయణగిరి షెడ్ల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.
క్యూలైన్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.