తిరుపతి గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం

తిరుపతిలోని గంగమ్మ జాతర ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిరుపతిలోని గంగమ్మను తిరుమల శ్రీవారి సోదరిగా.. తిరుపతిని సంరక్షించే గ్రామ దేవతగా భావిస్తారు. ఈ క్రమంలోనే గంగమ్మను ఎన్నో ఏళ్లుగా పూజిస్తున్నారు. ఒకటో శతాబ్దం నుంచి ఇక్కడ గంగమ్మ జాతర జరుగుతున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది మే నెలలో గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంలో ప్రజలు చిత్ర విచిత్ర వేషాలు ధరిస్తుంటారు. బూతులు తిడుతూ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే ఈ గంగమ్మ జాతరకు ఒక అరుదైన గౌరవం దక్కింది.

ఈ గంగమ్మ జాతరకు ఒక్క స్థానికులు మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు వాసులు కూడా వస్తుంటారు. దీంతో ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచింది. ఈ జాతర ప్రాధాన్యతను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం గంగమ్మ జాతరకు తమ రాష్ట్రంలోనూ ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే గంగమ్మ జాతరను తమిళనాడులోని పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి గంగమ్మ జాతర పుస్తకాన్ని రాశారు. దీనిని తమిళనాడు సర్కార్ పదోతరగతి పుస్తకంగా పాఠ్యాంశంగా ముద్రించి గంగమ్మ జాతరకు అరుదైన గౌరవాన్ని కల్పించింది.

Share this post with your friends