తెప్పలపై కన్నుల పండువగా శ్రీ కామాక్షి అమ్మ‌వారి ద‌ర్శ‌నం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఈ తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. తొలి రోజున శ్రీ వినాయక స్వామి, చంద్రశేఖర స్వామి తెప్పపై ఐదు చుట్లు విహరించగా.. రెండో రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఐదు చుట్లు, మూడో రోజు సోమస్కంద స్వామివారు ఐదు చుట్లు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. దీనిలో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది.

విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షి అమ్మ‌వారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఐదవరోజుతో ఈ తెప్పోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఐదవ రోజున శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ చంద్రశేఖర స్వామివార్లు తెప్పలపై విహరించనున్నారు.

Share this post with your friends