కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతానికి చెందిన ఐనవోలు అనంత మల్లయ్య శర్మ అనే గణపతి భక్తుడు ఒకసారి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనానికి వెళ్లాడట. స్వామివారి దర్శనానంతరం తిరిగి తన ఊరు వచ్చి సమీపంలోని సాయినాథుని ఆలయంలో పూజారిగా పూజాదికాలు నిర్వహించ సాగాడు. ఒకనాటి రాత్రి ఆయనకు కలలో మాడ ప్రభాకర శర్మ ఇంటిలోని ‘శ్వేతార్కమూల గణపతి’ దర్శనమిచ్చాడట. వెంటనే నల్గొండకు వెళ్లి ‘తెల్ల జిల్లేడు’ చెట్టు వేరులో ఉన్న గణేశుని విగ్రహాన్ని కనుగొన్నాడట.

అనంతరం 2009లో విష్ణుపురిలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కనిపించేలా మల్లయ్య శర్మ దేవాలయ నిర్మాణం చేశాడని చెబుతారు. ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. అనంతరం ఆ విగ్రహానికి పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్ని కూడా అమర్చడం జరిగింది. ఈ శ్వేతార్క గణపతి ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు అభిషేకం, 8.00 గంటలకు మహానివేదన, రాత్రి 7.00 గంటలకు ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ప్రత్యేక గణపతి హోమం, గరిక పూజలు నిర్వహిస్తారు.
