
మొత్తానికి తులసీదాసు మానస పూజ గురించి వివరంగా ధనపాలుడికి చెప్పాడు. పరమ లోభి అయినా కూడా భగవంతుడి పూజను చిత్తశుద్ధిగానే ధనపాలుడు చేసేవాడు. మొత్తానికి మానస పూజను ధనపాలుడు మొదలు పెట్టాడు. ఊహాలోనే అయినా కూడా పరమ లోభి కాబట్టి పంచదార ఎక్కువ వాడితే ఖర్చవుతుందని.. ఒక చిన్నా డబ్బా, స్పూన్ కొన్నాడు. అలా ఏళ్ల తరబడి ధనపాలుడు మానస పూజను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఒకరోజు ఆసక్తికర ఘటన జరిగింది. స్వామివారికి పాలు నివేదించే సమయానికి అతని మనస్సులో స్పూన్ కనిపించకుండా పోయింది.
స్పూన్ లేకపోవడంతో డబ్బాలో నుంచి పంచదారను పాలల్లోకి ఒంపాడు. అంతే పొరపాటున పంచదార పాలల్లో ఎక్కువ పడిపోయింది. వెంటనే మనస్సులోనే పాలగిన్నెలో చేయి పెట్టి, కరగని పంచదారను తీసివేయ సాగాడు. పదిహేనేళ్లుగా ధనపాలుడి మానసిక పూజను స్వీకరిస్తున్న శ్రీరాముడు అతని తీరుకు ఆశ్చర్యపోయాడు. ఇన్నేళ్లు గడిచినా అతని పిసినారితనం తగ్గకపోవడం శ్రీరాముడికి ఆసక్తిని రేకెత్తించింది. అప్పుడు స్వామివారు ధనపాలుడి చేయి గట్టిగా పట్టుకుని ‘పాలూ కాల్పనికమే.. పంచదారా కాల్పనికమే.. కాస్త ఎక్కువ పంచదార పడితే ఇబ్బందేమేంది?’ అని అడిగాడు. శ్రీరాముడి కర స్పర్శతో ధనపాలునిలో వైరాగ్యం కలగడంతో ఇక మీదట నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముడిని ధ్యానించుకోవాలని తపోభూమికి వెళ్లిపోయాడు.
