కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్..

అమ్మలమన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైంది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఇంద్రకీలాద్రి దుర్గ గుడి అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రసాద్ పథకం ద్వారా నిధులు ఎలా రాబట్టాలనే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. దుర్గ గుడి అభివృద్ధి విషయమై సనాతన ధర్మాన్ని పాటిస్తూనే ఆగమ శాస్రాలు, వైదిక ఆచారాల ఆధారంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయమై సమాలోచనలు చేశారు.

ప్రసాద్ పథకం ప్రకారం రూల్స్ మారుతున్నాయి. ఈ క్రమంలో త్వరితగతిన ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయరెడ్డి సూచించారు. దీనికోసం దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సంప్రదాయాలను అనుసరిస్తామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. భక్తుల విషయమై కూడా చర్చించారు. భక్తులకు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా వెయిటింగ్ రూములు నిర్మించాలని భావిస్తున్నారు. వందేళ్ల భవిష్యత్‌‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులపై కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Share this post with your friends