దసరా నాడు జమ్మి పూజ, ఆయుధ పూజ ఎందుకు?

హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా లేదంటే విజయదశమి ఒకటి. చెడుపై మంచి గెలిచినందుకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజున రావణాసురుడిని రాముడు సంహరించాడని చెబుతారు. అలాగే దుర్గమ్మ మహిషాసుర సంహారం గావించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. ఈ రోజున రావణ దహనం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఊరంతా ఒక చోటకు చేరి మరీ రావణ దహనం చేస్తారు. అలాగే ఈ పండుగ నాడు మరో ముఖ్య కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తారు. అదేంటంటే.. జమ్మిచెట్టును పూజించడం.

దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజిస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ జమ్మి పూజకు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పురాణాలు, జ్యోతిషశాస్త్రం పరంగా కూడా విశేషమైనదని అంటారు. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు వారు తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టుపై దాచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వచ్చి చూసినా కూడా వారి ఆయుధాలు చెక్కుచెదరకుండా ఉన్నాయట. ఫలితంగా జమ్మి చెట్టు శక్తికి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. నాటి నుంచే దసరా రోజున జమ్మిచెట్టుతో పాటు ఆయుధ పూజ నిర్వహిస్తారు.

Share this post with your friends