
మనిషి జీవితం సంఘర్షణల మయం. నిత్యం ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటాం. కొందరు అయితే ఆశించిన ఫలితం దక్కలేదని బాగా నిరుత్సాహ పడిపోతూ ఉంటారు. అసలు ఆశించి ఒక పని మొదలు పెట్టడమే తప్పని అంటారు. తద్వారా మనసులో ఒక భయం అనేది మొదలవుతుందట. లేనిపోని అనుమానాలు తలెత్తుతాయట. చేసిన పనికి ఫలితం దక్కితే ఎలాంటి ఆందోళనా ఉండదు. కానీ ముందుగానే ఫలితం ఆశించి అది అవకుంటేనే ఎక్కడ లేని నిరాశ, నిస్పృహలు మనలో చోటు చేసుకుంటాయి. దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం పరిష్కారం చెబుతుంది. అదేంటంటే..
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్యసిద్ద్యోః సిమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥
ఈ శ్లోకానికి అర్థమేంటంటే.. మనిషి సంకల్పంలోనే పొరపాటుంది. చేయాల్సిన పనిని మొదలు పెట్టినప్పుడే చక్కగా దానిని చెయ్యాలని కాకుండా ప్రయోజనాన్ని ఆశిస్తూ మొదలు పెట్టడమనేది చాలా తప్పు. మనకు అనుకున్న ఫలితం రాకుంటే దైవం అనుకూలించలేదని కృంగిపోవడం.. నిరుత్సాహానికి లోనవడం.. తద్వారా తీవ్ర మనోవేదనకు గురవడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఫలాపేక్ష మాత్రమే. ఒక్కోసారి సమభావనతో కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. ఈ సమభావనతో వ్యవహరించే వారికి ఫలితంపై ఆశ ఉండదు. మంచి, చెడులను సమానంగా తీసుకుంటారు. ఏం జరిగినా కర్మఫలమని సరిపెట్టుకుంటారు.
