సప్తవర్ణ శోభితం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. ముందుగా పుష్పాల ఊరేగింపు నిర్వహించారు. వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. పుష్ప‌యాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2 టన్నులు తమిళనాడు, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒక టన్ను కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు. ఈ పుష్పాలన్నింటితో అమ్మవారికి పెద్ద ఎత్తున పుష్పయాగం నిర్వహించారు.

Share this post with your friends