తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలతో కూడిన బుక్లెట్ను టీటీడీ ఈవో శ్రీజె.శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్లెట్ను ముద్రించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, ప్రెస్ మరియు పబ్లికేషన్స్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు టీటీడీకి అందాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక 15 రోజులలో వస్తుందని ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని టీటీడీ ఈవో తెలిపారు. అన్నప్రసాదం ట్రస్ట్ను మెరుగుపరచడానికి, మరింత బలోపేతం చేయడానికి కొన్ని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఈ నిపుణుల కమిటీ సూచనల మేరకు మేము చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు.