
కపిల తీర్థంలో మనకు తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయి. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేయగా.. మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. అందుకే ఇక్కడి స్వామివారికి కపిల ముని పేరు మీదుగా కపిలేశ్వరుడని పేరు వచ్చింది. అలాగే ఇక్కడి లింగాన్ని సైతం కపిల లింగమని పిలుస్తారు. త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడని కూడా చెబుతారు. అందుకే ఇక్కడి లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కామాక్షి అమ్మవారికి గంధం చీరను కడతారు. అమ్మవారిని గంధం చీరలో దర్శనం చేసుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయట. అందుకే దీనిని భక్తుల పాలిట కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. కపిల తీర్థం దర్శనం సర్వ పాప హరణం, సమస్త దుఃఖ హరణం అని కూడా అంటారు. వాస్తవానికి కపిల తీర్థం మహత్స్యం చాలా మందికి తెలియక వెళ్లరు. ఇక్కడికి వెళితే తప్పక శివపార్వతుల అనుగ్రహం లభిస్తుందట. కాబట్టి ఈసారి తిరుమలకు వెళితే కపిల తీర్థానికి కూడా వెళ్లి రండి.
